Unrevealed Secrets of Sripada

Click here to edit subtitle

Secret Abode of Datattatreya: DattaachlaKshetram (DattaalayaGutta)
రహస్య దత్త స్థావరం : దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట)

దత్తబంధువులందరికీ నమస్కారములు,
రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి గురించిన రహస్య సమాచారమేదైనా ఉంటే తెలపమని శ్రీపాద శ్రీ వల్లభుల వారిని నేను తరచూ నా మనసు లోనే అడిగే వాడిని. ఒక రోజు నాకు ప్రముఖ శ్రీపాద శ్రీ వల్లభ భక్తులైన శ్రీ మల్లాది వెంకట భాస్కర రావు గారి (న్యూ ఢిల్లీ) దగ్గర నుండి స్పీడ్ పోస్ట్ లో ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ ఇవ్వడానికి వచ్చినతను నాదగ్గర సంతకం తీసుకుంటుంటే నా మొబైల్ ఫోన్ మోగింది నా మొబైల్ ఫోన్ కు నేను  రింగ్ టోన్ గా "దిగంబరా..దిగంబరా..శ్రీ పాద వల్లభ దిగంబరా..దిగంబరా..దిగంబరా.. నరసింహ సరస్వతి దిగంబరా.." అనే  ట్యూన్ సెట్ చేసుకున్నాను. అది విన్న అతను "ఈ నరసింహ సరస్వతి ఎవరు? మా జోగిపేట దగ్గర ఒక గుట్టలో కుడా ఇదే పేరుని విన్నాను" అని చెప్పాడు. నేను నరసింహ సరస్వతి స్వామీ వారి గురించి చెప్పి అతని దగ్గర ఉన్న అస్పష్ట మైన సమాచారాన్ని, అడ్రస్ ను తీసుకోని మొత్తానికి అతను చెప్పిన గుట్ట చేరాను. అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది అది ఒక అతి రహస్యమైన దత్తక్షేత్రమనీ , శ్రీపాదుడు తన పాద స్పర్శతో పునీతం చేసిన ప్రదేశమనీ, నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాలు రహస్యంగా తపస్సు చేసిన ప్రాంతమనీ,  గురుచరిత్ర వ్రాసిన నామధారకుడు తన అంత్యకాలంలో ఇక్కడే గడిపాడని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. అక్కడ ఉండే దత్తాత్రేయుని రూపం చూసి మరింతగా ఆశ్చర్యపోయాను. వెంటనే స్థానికులను, పూజారి గారిని కలిసి  మన వెబ్సైట్ భక్తులందరి కోసం ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్నాను. ఆస్వాదించండి.
దిగంబరా..దిగంబరా..శ్రీ పాద వల్లభ దిగంబరా..దిగంబరా..దిగంబరా.. నరసింహ సరస్వతి దిగంబరా..
మీ
కీర్తి వల్లభ
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ఎక్కడుంది?
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) మెదక్ జిల్లా లో నర్సాపూర్ కు దగ్గర లో గల హత్నురా మండలం లోని మాధుర గ్రామ శివార్లలో ఉంది.
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ప్రత్యేకత ఏంటి?
  • ఏక పాద దత్తక్షేత్రం
  • శ్రీపాద శ్రీ వల్లభులు తమ 16వ ఏటా పిఠాపురంలో సన్యాస దీక్ష తీసుకోని, ఇంటినుండి బయలుదేరి ఉత్తరదేశ ముఖంగా వెళ్లి అనేక క్షేత్రాలను దర్శించి తరువాత గోకర్ణం చేరి అక్కడ 3 సంవత్సరాలకాలముండి, దత్తాచలం చేరి అక్కడి  గుహలలో గల మహాసిద్ధులను ఆశీర్వదించి, దగ్గరలో గల మంజీరా నదిలో స్నానమాచరించి, దత్తాచలక్షేత్రం మీదుగా శ్రీశైలం చేరారని ఇక్కడి స్థల పురాణం
  • నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాలు రహస్యంగా తపస్సు చేసిన ప్రదేశమిది
  • నరసింహ సరస్వతి స్వామి వారి ముఖ్య శిష్యుడు మరియు గురుచరిత్ర వ్రాసిన నామధారకుడు తన అంత్యకాలం మొత్తం ఇక్కడే గడపడం విశేషం
  • మంజీరానది కి (సుమారు 8 కీ.మీ. దూరంలో) సమీపం లో గల దత్తక్షేత్రం
  • దత్తాలయగుట్టకు సమీపంలోనే అన్ని విధాలా కాశీ విశ్వేశ్వరుడిని పోలిఉన్న కాశీపతి దేవాలయం కలదు. ఈ గుడి వద్దనే శ్రీగురుని ఏక పాదముద్ర గలదు
  • శ్రీచక్రాన్ని కలిగి ఉన్న ఏకైక దత్తాత్రేయుడు
  • ఇక్కడ శ్రీచక్ర సహిత దత్తాత్రేయుడు కొలువుతీరి ఉండడం వల్ల ఈక్షేత్రం "మహిళా దత్తక్షేత్రం" గా వెలుగుతోంది (ఇక్కడి గుడి నిర్మాణ కార్యక్రమమును ప్రారంబించింది కుడా ఒక మహిళా మంత్రే!)
  • ఇక్కడ న్యాయబద్ధమైన కోరిక కోరిన మహిళలు, అవి తీరకుండా నిరాశ పొందిన మహిళ ఒక్కరు కుడా లేరట.
  • ఇక్కడ కొలువుతీరిన దత్తుడి రూపం మనం ఊహించనిదిగా, ముందెప్పుడూ చూడని విధంగా ఉంటుంది.
శ్రీచక్రం లేదా శ్రీయంత్రం అంటే ఏమిటి? ప్రాముఖ్యత ఏంటి?
కొన్ని అవ్యక్త తాంత్రిక సిద్ధాంతలాధారంగా గొప్ప గణిత శాస్త్రీయ విధానంలో, తనకు తానై ఆవిష్కరించుకొన్నటువంటి మహాయంత్రం శ్రీచక్రం. సృష్టి వైచిత్రినీ, రహస్యాలను ఇంత సంపూర్ణమైన అధ్యయనంతో అన్వయించి సాధకుడి సకల మనోభీష్టములను సిద్ధింప చేయగలిగినటువంటి యంత్ర రాజం మరొకటి లేదు.
శ్రీచక్రం లేదా శ్రీయంత్రం ఒక పవిత్రమైన యంత్రం. దీనిలో తొమ్మిది అనుసంధానించబడిన త్రిభుజాలు కేంద్రంలోని బిందువు చుట్టూ అమర్చబడి ఉంటాయి. ఇది శ్రీలలితా లేదా త్రిపుర సుందరి అనే దేవతను తెలుపుతుంది. దీనిలోని నాలుగు త్రిభుజాలు ఉర్ధ్వ ముఖంగా ఉండి శివుణ్ణి  లేదా పురుషుణ్ణి సూచిస్తాయి. అయిదు త్రిభుజాలు నిమ్న ముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. అందువలన శ్రీచక్రం స్త్రీ-పురుషుల సంయోగాన్ని తెలుపుతుంది. ఇందులో తొమ్మిది త్రిభుజాలున్నందున దీనిని నవయోని చక్రం  అని కూడా అంటారు. శ్రీచక్రం గురించి ఇంకా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ను ఎలా చేరుకోవాలి?
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ను సొంత వాహనాలలో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి దాదాపుగా 100 కీ.మీ. దూరం (ఒక వైపు) ఉంటుంది. అక్కడి ప్రజలని రూట్ అడిగేటప్పుడు 'మాధుర' కు బదులుగా 'మాదారం' అని అడిగితే సులభంగా గుర్తుపడతారు. టూవీలర్ మీద వెళ్ళేవారు హత్నురా ITI లోపల నుండి / ఫోర్ వీలర్ పై వెళ్ళేవారు ITI పక్కనగల మట్టి రోడ్డు ద్వారా సులభంగా దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ను చేరుకోవచ్చు.
హైదరాబాద్ నుండి రూట్: బాలానగర్----> జీడిమెట్ల----> గండి మైసమ్మ-X-రోడ్స్----> ORR లో స్ట్రైట్ రోడ్ తీసుకోవాలి----> నర్సాపూర్ రోడ్---->డుండిగల్----> గుమ్మడిదల---->నల్లపల్లి ఫారెస్ట్---->నర్సాపూర్----> నర్సాపూర్ లో అంబేద్కర్ స్టాచ్యు దగ్గర ఎడమవైపు తీసుకోవాలి---->దౌలతాబాద్ రోడ్ -----> దౌలతాబాద్-----> దౌలతాబాద్ 'Y' జంక్షన్ లో కుడి వైపు రోడ్ తీసుకోవాలి---->హత్నురా రోడ్----> హత్నురా---->కొన్యాల్ రోడ్---->మాధుర గ్రామం-----> దత్తాలయగుట్ట
దత్తాచలక్షేత్ర సందర్శనలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దత్తాచలక్షేత్రాన్ని దర్శించు కోవాలనుకునే వారు పుజాసామగ్రిని వెంటతీసుకోని వెళ్ళడం మంచిది. అలాగే దత్తాచలక్షేత్ర పూజారి అయిన శ్రీ సభాపతి శర్మ గారిని ఫోన్ ద్వారా సంప్రదించి వెళ్ళడం మంచిది. దయచేసి గమనించండి దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) పరిసర ప్రాంతాలలో పాములు (Indian King Cobra), చిరుతపులుల (Chita) సంచారం ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి తగినన్ని రక్షణ చర్యలు తీసుకోని వెళ్ళడం మంచిది. సాయంత్రం, పొద్దుపోయే వేళల్లో వెళ్ళడం నిషేదం. గుమ్మడిదల నుండి నర్సాపూర్ మధ్యలోగల దట్టమైన అటవీ ప్రాంతంలో  విపరీతమైన వేగంతో వచ్చే హెవీ ట్రక్కులు, ఆర్టిక్యులేటేడ్ లారీలతో నిండి ఉండే ఈ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయం పూట అయితే (6.30 AM To 12.30 PM వరుకు) డుండిగల్ దగ్గర గల SGS (శ్రీ గణపతి సచ్చిదానంద) ఆశ్రమాన్ని కుడా ఇదే దారిలో దర్శించవచ్చు.
దత్తాచలక్షేత్ర (దత్తాలయగుట్ట) స్థలపురాణం

రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు గాణ్గాపురము నందు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారి వద్ద గల శిష్యులకు సనాతన ధర్మములను ఉపదేశించేవారు. వారి శిష్యగణంలో అతి ముఖ్యమైనవారు శ్రీ నామాధారకులు. నామధారాకుల వారు గురు ఆశీర్వాదం మెండుగా కలిగినవారు, మరియు గృహస్తు కుడా. వారు అనేక వేదములను అధ్యయనం చేసి,  శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి సేవలో గడిపి శ్రీగురుని (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) వద్ద నుండి అనేక గురుసేవా రహస్యాలను తెలుసుకున్న దత్తదైవాంశ సంభూతులు. అలాగే గురు చరిత్రను మనకి అక్షర రూపంలో అందించినది కుడా ఈయనే. ఇటువంటి స్థితిలో గల నామధారాకుల వారు శ్రీగురుని విడిచి క్షణమైనా ఉండలేకపోయేవారు. ఒకానొక సమయంలో శ్రీగురుడు (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) 12 సంవత్సరాల పాటు గాణ్గాపురమును విడిచి తపస్సు చేసుకొనుటకు వేరే ప్రాంతానికి వెళతారు. ఆ 'గురు ఎడబాటు' తట్టుకోలేని నామధారకుడు గురువు గారి జాడ కోసం అనేక ప్రయత్నాలు చేసి ఆఖరుకు శ్రీగురుడు దత్తాచలక్షేత్రం లో తపస్సు చేసుకొంటున్నట్లుగా తెలుసుకుంటారు. ఆ తరువాత ఒకానొక మాఘ బహుళ పాడ్యమి రోజు శ్రీగురుడు నిర్హరితం చెందినట్లుగా తెలుసుకొని ఎంతో దుఃఖించి, విరక్తి చెంది, ముందు లాగే మళ్లీ ఎలాగైనా దత్తాచలక్షేత్రం లో కనబడవచ్చనే నమ్మకంతో దత్తాచలం వచ్చి శ్రీగురుని కోసం ఘోరంగా తపస్సు చేస్తారు. నామధారాకుల వారి అచంచల గురు భక్తికి మెచ్చి శ్రీచక్ర సమేతంగా శ్రీదత్తాత్రేయుల వారు ప్రత్యక్షమై, వెంటనే శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిగా దర్శనమిచ్చి జనన-మరణ-వైరాగ్య బోధనలను ఉపదేశించి, వారి పాదుకలను (నిర్గుణ పాదుకలు - ప్రస్తుతం మనం చూసే నిర్గుణ పాదుకలు అవే)

శ్రీ నామధారాకులవారికిచ్చి, వాటిని గాణ్గాపుర ఆశ్రమంలో ప్రతిష్టించి నిత్యపూజలు చేస్తూ సనాతనధర్మములను భక్తులకు భోదించమని చెప్పి అంతర్ధానమవుతారు. అంతట శ్రీగురుని ఆదేశానుసారం శ్రీ నామదారకులు శ్రీగురుని పాదుకలను ప్రతిష్టించి  సనాతనధర్మప్రచారం చేస్తూ కాలం గడుపుతారు. శ్రీ నామదారకులు వృద్దాప్యం లోకి వచ్చిన తరువాత మళ్లీ శ్రీగురుని వెతుక్కుంటూ దత్తాచలం చేరి దత్తాచలగుట్ట వద్ద గల దత్తకొలను లో నీటి మీద కుర్చుని అన్న, పానీయాలు మాని శ్రీగురుని దర్శనభాగ్యం కోసం తపోనిష్టలో ఉండేవారు.


దాదాపుగా అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పాలించే నవాబ్ (రాజు - King) గారి ఒక్కగానొక్క కూతురికి రాచపుండు (Cancer) వ్యాధి వస్తుంది. అప్పుడు ఆ నవాబ్ గారు కూతురుని బతికించమని అనేక మంది వైద్యులను కలుస్తారు. అందరు వైద్యులు కుడా ఈ జబ్బు తగ్గదని, త్వరలోనే మరణం తధ్యమని చెపుతారు. అయినప్పటికీ నవాబ్ గారు ఏదైనా  ఉపాయం చెప్పమని వైద్యులని వేడుకుంటాడు. ఆ వైద్యులలో ఒక వైద్యుడు " మీ కూతురు మరణించకుండా ఆపలేము కాని ఆ మరణాన్ని వాయిదా వేయుటకు ఒక సలహాగలదు" అని చెపుతాడు. అంతట ఆ నవాబ్ గారు ఆ సలహా ఏమిటో చెప్పమని వేడుకొనగా "మీ కూతురిని నగర కాలుష్యం నుండి దూరంగా అడవికి తీసుకుని వెళ్లి అక్కడ లభించే సహజ ఫలాలు, తెనేవంటివి ఇస్తే మరొక రెండు నెలలు బ్రతకవచ్చు" అని సలహా ఇస్తాడావైద్యుడు.

వెంటనే నవాబ్ గారు రాజ్యాన్ని వారి తమ్ముడికి అప్పజెప్పి కొంత మంది పని వారిని తీసుకోని కూతురితో సహా దట్టమైన అడవులలోకి వెళతారు. పనివారు ఆహార సేకరణ లో భాగంగా దత్తాచలగుట్ట దగ్గరకు వస్తారు. అక్కడ గల కొలనులో నీటి మీద కుర్చుని తపోనిష్ట లో ఉన్న శ్రీ నామదారకుడిని చూసి, ఆశ్చర్యపోయి ఆ సమాచారాన్ని నవాబ్ గారికి అందిస్తారు. అప్పుడు ఆ నవాబ్ గారు నీటి మీద కుర్చుని తపోనిష్ట లో ఉన్న శ్రీ నామదారకుడిని చూసి, ఆయన వద్దకు వెళ్ళాలా? వద్దా? పైగా ఆయన హిందూ మతస్తుడు, నేనేమో మహామ్మదియుడిని అని ఆలోచిస్తారు, ఈయన ఎలాగైనా నా కూతురుని రక్షించగలరని మనసులో అనుకోని

శ్రీ నామదారకుడి వద్దకు వెళతారు, తమ కూతురిని రాచపుండు (Cancer) వ్యాధి నుండి రక్షించమని వేడుకుంటారు. దానికి సమాధానంగా శ్రీ నామదారకుడు "అయ్యా రాజు గారు, నేను ఒక సాధారణ బ్రాహ్మణుడను. నావద్ద ఎలాంటి మంత్ర విద్యలు కాని, వైద్య విద్యలు కాని, సంజీవిని కాని లేదు. జీవితం పై విరక్తి చెంది, పెళ్ళాం బిడ్డలను వదిలి సన్యశిస్తున్న సాధారణ సన్యాసిని నేను, తపోభంగం కలిగించవద్దు దయచేసి వెళ్ళిపోండి" అని చెబుతారు.


నవాబ్ గారు ఆరోజుకు వెళ్లి పోయినా ఆరోజు నుండి ప్రతీ రోజు వచ్చి శ్రీ నామదారకుల వారిని తగిన నివారణోపాయాన్ని తెలపమని ప్రార్ధిస్తూనే ఉంటారు. ఆఖరుకు ఒక రోజు  శ్రీ నామదారకుల వారు ఈ దత్తకొలను లోని నీటిని తీసుకువెళ్లి మీ కూతురికి త్రాగించి, రాచపుండు కురుపును (Cancer Wound) రోజూ కడుగుతూ ఉంటే

శ్రీగురుని దయతో నయం అవుతుందని చెపుతారు.  శ్రీ నామదారకుల ఆజ్ఞానుసారం ప్రతీ రోజూ నవాబ్ గారు వారి కూతురికి  దత్తకొలను లోని నీటిని తీసుకు వెళ్లి త్రాగించి, రాచపుండు కురుపును (Cancer Wound) కడుగుతూ ఉండగా కొద్ది రోజులలనే ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన కూతురుని తిరిగి రాజ్యంలో దిగబెట్టి సంతోషంతో నవాబ్ గారు దత్తాచలం చేరి  శ్రీ నామదారకుల వారిని కలసి ఏమైనా బహుమతి కోరుకోనమనగా సన్యాసి అయిన నాకు ఏమి అవసరం లేదని, ఏదైనా ఉంటే దత్తుడికి ఇచ్చుకోమని, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెబుతాడు. అంతట ఆ నవాబ్ గారు దత్తాచలగుట్ట నుండి అష్టదిక్కులలో ఎటు చూసినా 1000 ఎకరాల భూమి స్వామీ వారి పేరు మీద రాగి పత్రాల పై రాయించి అక్కడ పెట్టి వెళ్లిపోతాడు.  ఆవిధంగా శ్రీ నామదారకుల వారి పేరు ఇతరప్రాంతాలకు వ్యాపించింది.

శ్రీ నామదారకుల వారి జాడ తెలిసిన వారి భార్య- పుత్రులు దత్తాచలక్షేత్రం వచ్చి కుటుంబ పోషణ కష్టంగా ఉంది, దయచేసి సన్యాసదీక్ష విరమించవలసిందిగా కోరతారు. అందుకు ససేమిరా అన్ననామదారకుడు ఈ గుట్టకు దూరంగా నవాబ్ గారు ఇచ్చిన 1000 ఎకరాల భూమిలో కేవలం ఉదార పోషణ నిమిత్తం ఎంత అవసరమో అంత భూమిని మీరు సాగుచేసుకోవచ్చని చెప్పి, తనకు మాత్రం తపోభంగం కలిగించవద్దని , తాను అనతి కాలంలోనే గొప్ప ఆధ్యాత్మిక స్థితికి చేరుకోబోతున్నట్లుగా చెప్పి దత్తాచలక్షేత్ర గుట్ట మీద గల గుహలో తీవ్ర తపమాచరించడానికి సమాయత్తమవుతారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడచిన తరువాత ఒక రోజూ వారి కుమారుడైన శ్రీ సూర్యభట్టు కు స్వప్నంలో శ్రీ నామదారకుల వారు కనబడి "కుమారా... నేను దత్తాత్రేయస్వామీలో లయం చెందాను. దత్తుడుకి ప్రతీ సంవత్సరం మార్గశీర్ష శుద్ధ షష్టి నుండి మార్గశీర్ష  పౌర్ణమి వరకు (దత్త జయంతి) ఉత్సవాలు జరిపి, చివరి రోజైన దత్త జయంతి రోజున అన్నసంతర్పణ జరిపించవలసిందిగా మనవి" అని చెపుతారు.

శ్రీ నామదారకుల వారు దత్తాత్రేయునిలో లయం చెందిన కారణంగా ఈ ప్రాంతాన్నే "దత్తాలయగుట్ట" అనికూడా పిలుస్తారు. శ్రీ నామదారకుల ఆదేశానుసారం నాటినుండి (600 సంవత్సరాల నుండి) నేటి వరుకు వారి వంశస్థులు ప్రతీ సంవత్సరం ఉత్సవాలను జరుపుతున్నారు.


శ్రీ నామదారకుల వారిని లయం చేసుకోవడానికి విచ్చేసిన శ్రీగురుడు (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) మొదటి పాదం మాధురగ్రామ పరిసరాల్లో గల కాశీపతి దేవాలయం దగ్గర పెట్టగా రెండవపాదం దత్తాచలగుట్ట మీద మొదటి పాదానికి అభిముఖంగా పెడతారు. ఈ రెండు చోట్లా ఏకపాద ముద్రలే ఇక్కడ ఉంటాయి, మరియు ఈ రెంటి మధ్య సుమారు 1 కీ.మీ. పైన దూరం ఉంటుంది. ఇవి శ్రీగురుని అసలైన పాదముద్రలు. వెంటనే శ్రీ నామదారకులు దత్తాచలగుట్ట పై రెండవ పాదముద్రను ప్రతిష్టించి శ్రీగురునిలో లయంఅవుతారు.

ఆశ్చర్యపరిచే ప్రత్యక్ష నిదర్శనాలు
  • ప్రతీ పౌర్ణమి మరియు అమావాస్యలకి ఇక్కడ అర్ధరాత్రి 2.00 గంటల నుండి 2.30 గంటల మధ్య ఈ గుట్టలో 'ఓం' కార శబ్దం ధ్వనిస్తుంది. శక్తి, ధైర్యం,ఈ ఓంకార శబ్దాన్ని వినాలనుకునే ఆశక్తిగల వారు ఇక్కడి పూజారి అయిన శ్రీ సభాపతిశర్మ గారికి చెబితే వారు మీరు రాత్రికి  దత్తాచలగుట్ట మీద ఉండడానికి బస ఏర్పాటు చేస్తారు.
  •  దత్తాచలగుట్ట మీద వెలసిన దత్తాత్రేయుని పాదముల వద్ద మన చెవిని ఆనించి ప్రశాంతంగా వింటే అన్నివేళలా "ఓం" కార శబ్దం వినిపిస్తుంది.
  • మనుష్య సంచారం ఉండని సాయంత్ర వేళల్లో, తెల్లవారు ఝామున భయానకరూప దిగంబరులని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు.
  • అప్పట్లో నవాబ్ గారు రాసిచ్చిన 1000 ఎకరాల భూమి లో ప్రస్తుతం 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈ 10 ఎకరాలూ "శ్రీ దత్తాత్రేయ స్వామి" వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడినది. ఆ రిజిస్ట్రేషన్ పేపర్లను మనం చూడవచ్చు. ( గడచిన 600 సంవత్సరాలలో నవాబులు పోయారు, నిజాం పాలన పోయింది, బ్రిటీష్ పాలన పోయింది, ఇండియన్ గవర్నమెంట్ వచ్చింది, మద్రాస్ తో పాటు ఉన్న ఉమ్మడి రాష్ట్రం పోయింది, కర్నూల్ రాజధాని మారి హైదరాబాద్ వచ్చింది, కరణీకం పోయింది - ఇన్ని మార్పులు రావడం వల్ల రికార్డులు మార్చి విలువైన దత్తాత్రేయుని భూమి కబ్జా చేయబడినది)
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) క్షేత్ర నిర్వాహకుల సమాచారం
శ్రీ సభాపతి శర్మ(బాబు పంతులు) - శ్రీ నామధారకుల వంశీకులు మరియు దత్తాచలక్షేత్ర పూజారి
Mobile No: 09247334660
కాశీపతి దేవాలయం తాళం చెవి ఉన్న, ఏక పాద ముద్రను చూపించగల మాధుర గ్రామ స్థానికులు శ్రీ శ్రీనివాస్ గౌడ్
Mobile No: 9949687780

Photos of Dattaachla Kshetram (DattaalayaGutta)  దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ఫోటోలు

దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) కొండ మీదికి మెట్ల మార్గం
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) నిర్మాణ ప్రారంభోత్సవ శిలా ఫలకం & గుట్ట మీద ప్రధాన ద్వారం
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట)
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట)
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) కొండ మీద నామధారకుడు ప్రతిష్టించిన శ్రీగురుని (నరసింహ సరస్వతి) పాదుకలు
శ్రీగురు (నరసింహ సరస్వతి) పాదుకలు
శ్రీగురుని అసలైన ఏక పాదముద్ర (కుడివైపు) మరియు నామదారకులు ప్రతిష్టించిన రెండవ పాదముద్ర (ఎడమవైపు)
దత్తకొలను
పశ్చిమాభిముఖ ఆంజనేయుడు & దత్తాత్రేయుడు
దత్తాచలక్షేత్ర దత్తాత్రేయుడు - ఫోటోలో దత్తాత్రేయుని త్రిశూలం పైన గల శ్రీచక్రాన్ని గమనించండి
శ్రీపాద శ్రీ గురు సంగమం సేవా ట్రస్ట్ ఆధ్వర్యం లో దత్తాచలక్షేత్రం లో జరిగిన 6 ఔదుంబర & 1 బిల్వ వృక్షాల స్థాపన
అలంకరించిన శ్రీగురు పాదుకలు

కాశీపతి దేవాలయం మరియు స్వయంభూ దేవుళ్ళు

కాశీపతి దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీగురుని ఏక పాద ముద్ర
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట)
 శ్రీ నామదారకులు నీటి పై కూర్చుని తప్పస్సు చేసిన దత్తకొలను