Unrevealed Secrets of Sripada

Click here to edit subtitle

దత్తాత్రేయుడు - రహస్యాలు (పరిశోధనాత్మక వివరణ)
దత్తాత్రేయుడు రమారమి 200 కోట్ల సంవత్సరాలకు పూర్వం అత్రి - అనసూయలకు కుమారుడిగా భూలోకం లో అవతరించాడు. భాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో శ్రీ మహావిష్ణువు యొక్క 21 అవతారములలో 6వ అవతారం దత్తాత్రేయ అవతారమని చెప్పబడింది. అలాగే శ్రీమన్నారాయణుని లీలావతారాల్లో 4వది దత్తావతారం. దత్తావతారం దశావతారాలకన్నా చాలా పురాతనమైనది.దత్తాత్రేయుడు యోగసంప్రదాయకుడని 'నారద పరివ్రాజకోపనిషత్తు' చెబుతుంది. దత్తాత్రేయుడు 'వాతారసన' అను 'ఋషీసంప్రదాయాని'కి చెందినవాడనీ, మౌనప్రియుడనీ, పరిశుద్ధుడనీ భాగవతం చెబుతుంది.
II దత్త స్త్వయోగః  అధ యోగానాథ: II

దత్తాత్రేయుడు యోగవిద్యకు అధిదేవత, గురు పరంపరకు ఆద్యుడు. అసలు దత్తాత్రేయుడే చాలా ఆశక్తికరమైన దేవతావతారం. ఇంకా చెప్పాలంటే దత్తాత్రేయుడు
శ్రీ మహావిష్ణువు యొక్క ఆశక్తికరమైన అవతారము. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే దత్తాత్రేయుడు దేవుడా? (పరబ్రహ్మమా?) లేక దేవుని అవతారమా? ( పరబ్రహ్మ అవతారమా?) అని...
కొన్ని పరిశోధనాత్మక గ్రంధాలను పరిశీలించిన తరువాత తెలిసిందేంటంటే దత్తాత్రేయుడు పరబ్రహ్మే కానీ పరబ్రహ్మ కాదు , "పరబ్రహ్మ ప్రత్యేకతలు" కలిగిన "పరబ్రహ్మ అవతారము"తెలిసింది. అప్పుడు మళ్లీ అనేక సందేహాలు పుట్టాయి. వాటిలో ప్రదానమైనది దేవుడికి దేవుని అవతారానికి ఉన్న తేడా (పరబ్రహ్మకీ, పరబ్రహ్మ అవతారానికీ) ఏంటని? మళ్లీ అనేక గ్రంధాలను పరిశీలించిన తరువాత, అనేక మంది యోగులతో మాట్లాడిన తరువాత కొద్ది మొత్తంలో సమాచారం దొరికింది.
ఆ సమాచారం ఉన్నది ఉన్నట్లుగా .

దేవుడు (పరబ్రహ్మ)
 దేవుని అవతారము (పరబ్రహ్మ స్వరూపం)
 
దేవుడికి రూపం లేదు
దేవుని అవతారానికి రూపం ఉంటుంది
 
దేవుడినే "పరబ్రహ్మ" అని చెపుతారు
రూపం ఉంటుంది కాబట్టి దేవుని అవతారాన్ని మనం దేవుడిగా భావించి పూజిస్తాము. అందుకే దేవుని అవతారానికి "పరబ్రహ్మ స్వరూపమని" పేరు
 
దేవుడు సర్వవ్యాప్తంగా ఉంటాడు, శూన్యంలో కుడా వ్యాప్తిచెంది ఉంటాడు
  దేవుని అవతారానికి పరిమితులతో కూడిన వ్యాప్తి ఉంటుంది
 
దేవుడికి పుట్టుక, నాశనము, సమాప్తి అనేవి ఉండవు
దేవుని అవతారానికి పరిసమాప్తం ఉంటుంది, సాధారణంగా అయోనిజులుగా ఉద్భవిస్తారు.
 
దేవుడు ఎవరికీ కనిపించడు (ముఖ్యంగా మానవులకు) దేవుడిని చూసి తట్టుకునే శరీర నిర్మాణం (చక్రశుద్ధి) మహామునులు, ఋషులకు తప్ప సాధారణ మానవులకు లేదు 
  మానవులకు దేవుని అవతార దర్శనం జరుగుతుంది. దేవుని అవతారాన్ని మాత్రమే మానవులు చూడగలరు
 
దేవుడు మొత్తం గా 3 భాగాలుగా ఉంటాడు, మూడు విధులను నిర్వర్తిస్తూ ఉంటాడు  (సృష్టి-స్థితి-లయ)
  దేవుడు ఇచ్చిన విధులను నిర్వర్తించి, పని పూర్తైన తర్వాత తిరిగి దేవునిలో ఐక్యం అయ్యేదే దేవుని అవతారము. అది తిరిగి మళ్లీ అనేక అంశావతారాలుగా విభజించబడి ఉండచ్చు లేదా ఉండకపోవచ్చు 
 
దేవుడి యొక్క మూడు భాగాలకు కుడా రూపం లేదు
  దేవుని అవతారానికి ఎలాగైతే రూపం కలదో , అలాగే దేవుని అవతార అంశావతారాలకు కుడా రూపం ఉంటుంది.
 
  దేవుని యొక్క ప్రతీ భాగము "ద్రవ్యము" మరియు "కేంద్రకము" అనే రెంటి కలయిక ద్వారా ఏర్పడుతుంది. ద్రవ్యము కేంద్రకాన్ని పట్టిఉంచితే, కేంద్రకం ద్రవ్యాన్ని పట్టి ఉంచుతుంది. కేందకము లోనే శక్తి ఉంటుంది (దీనినే పరాశక్తి అని మనం పిలుస్తాము), ఈ శక్తి ని వినియోగించుకొని ద్రవ్యం విధులను నిర్వర్తిస్తుంది.  
  దేవుని అవతారాలు దేవుడి భాగాలతో (కనిపించని - నిర్గుణ) పాటుగా మానవగోచర భాగాలను కలిగి ఉంటారు. 
 
దేవుడు గుణసహితుడు (రజో,తమో మరియు సత్త్వ గుణాలు)
దేవుని అవతారమూ గుణసాహితమే కాని భక్తుల కోసం గుణరహితంగా కనిపిస్తాడు ఒక్కోసారి భక్తులపక్షపాతిగా ఉంటాడు. భక్తులకు రావలసిన రోగాలు, బాధలను మౌనంగా భరిస్తాడు. ఒక్కోసారి తరువాతి జన్మలోని  ఆయుష్షును కొంత ఈ జన్మలోకి అవసరాన్నిబట్టి మారుస్తాడు.  దేవుని అవతారాలు మానవుల కోరికలని  సులభంగా తీర్చడం వల్ల వారే దేవుడిగా కొలవబడతారు.
 
 దేవుడు అపరిమిత శక్తులు గలవాడు
 దేవుని అవతారాలు పరిమిత శక్తులను మాత్రమే కలిగి ఉంటాయి. అవసరాన్నిబట్టి కొన్ని ఎక్కువ శక్తులను దేవుని ద్వారా పొందేవీలు ఉంటుంది
 
 దేవునిలో (పరబ్రహ్మ) మూడు భాగములు కలవు.
1. హిరణ్యగర్భ భాగము - సృష్టి (బ్రహ్మ అని అంటారు)
2. నారాయణ భాగము - స్థితి (విష్ణు అని అంటారు)
3. రుద్రభాగము - లయ (మహేశ్వరుడు అని అంటారు)

సృష్టి, స్థితి మరియూ లయము ఇవన్నీ రూపరహితుడైన దేవుడే చేయాలి. అవి చేయడానికి ఒక్కో గుణాన్ని స్వీకరించి ఒక్కో రూపంలో భక్తులద్వారా వర్ణింప బడతాడు.  రజోగుణం అనేది ప్రవృత్తిలోకి తీసుకెళ్తుంది కనుక సృష్టి చేయాలంటే రజోగుణం కావాలి. తాను సృష్టి చేసేటప్పుడు రజోగుణాన్ని ప్రధానంగా తీసుకొని సృష్టి కార్యాన్ని నడిపిస్తాడు. లయం చేయాలంటే తమోగుణం కావాలి, కనుక లయం చేసేటప్పుడు తమోగుణాన్ని ప్రధానం చేసుకొని కార్యాన్ని నడిపిస్తాడు. స్థితి లేదా రక్షణ చేయాలంటే సత్త్వగుణం కావాలి. సత్త్వం అనేది మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా చూపించగలదు, అది నిర్మలంగా ఉంటుంది. రక్షణ చేసేటప్పుడు పక్షపాతం ఉండకూడదు. ఏ ప్రలోభాలకు లొంగకుండా కేవలం తనకుండే అనంతమైన,సహజమైన జ్ఞానంతో, ఎవరెవరికి ఏవేవి తగునో అవి ఇస్తూ, అవసరం లేని వాటిని తొలగించడం చేయాలంటే నిశ్పాక్షికమైన బుద్ధి ఉండాలి. అలాంటిది సత్త్వం వల్లనే సాధ్యం కనుక, అది ప్రధానం చేసుకొని స్థితికార్యాన్ని సాగిస్తాడు పరబ్రహ్మ.

దత్తాత్రేయ అవతార ఆవిర్భావం & ప్రత్యేకత (అసలైన పరిశోధనాత్మక వివరణ)

ఈ చరాచర సృష్టిలో ఎవరికి అంతుచిక్కని (దేవతలకు సైతం) పరబ్రహ్మతత్వాని గురించి తెలుసుకొనుటకు కృతయుగములో ఋషులందరూ కలసి సామూహికంగా పరబ్రహ్మ కొరకై తపస్సు చేసారు. అందుకనే ఆకాలానికి "కృతయుగం" అని పేరు వచ్చింది. కృతము అనగా తపస్సు. అందరి తపస్సులలో ఒకానొక మహాముని (అప్పటికి ఇంకా అత్రి మహాముని అని పేరు పెట్టబడలేదు) తపస్సు యోగ్యమైనందువల్ల పరబ్రహ్మ అతనికి సాక్షాత్కరించదలచెను. సాక్షాత్కరించుటకు ముందు పరబ్రహ్మ ఆ మహామునిని పరీక్షింపదలచి రూపరహితుడు, నిరాకారుడు అయిన పరబ్రహ్మ యొక్క మూడు భాగాలు కావాలని రూపుధరించి మూడు రూపాలలో విడివిడి గా ఆ మహాముని ఎదుట నిలిచాయి. వారే పరబ్రహ్మ అనీ, సృష్టి-స్థితి-లయ కారకులుగా పరిచయం చేసుకొన్నాయి. అంతట ఆ మహాముని పరబ్రహ్మ ఏకపదార్ధమని,ఏకస్వరూపమని విడివిడిగా  ఉండే పరబ్రహ్మ తనకు అవసరంలేదని సున్నితంగా వారితో చెప్పి వారిని నిరాకరిస్తాడు. అప్పటినుండి ఆ మహాముని "అత్రి" అని పిలవబడ్డాడు. (అ = నిరాకరించిన / ఒప్పుకోని,  త్రి = ముగ్గురు - పరబ్రహ్మని ముగ్గురిగా  ఒప్పుకోని మహామునే 'అత్రి' మహాముని ). అంతట పరబ్రహ్మ అత్రి మహాముని వేదజ్ఞానానికి సంతోషించి, ముగ్గురుగా ఉన్న పరబ్రహ్మ అదృశ్యమై ఏకరూపంగా అత్రికి సాక్షాత్కరించింది. అప్పటివరకూ రూపమేలేని పరబ్రహ్మ రూపుధరించి, అందునా ఏకరూపంగా సాక్షాత్కరించడంతో అచ్చెరువొందిన అత్రి మహాముని "దత్తః దత్తః" అని ఆనందంతో అరిచెను. దత్తః అంటే కనిపించింది, దొరికింది లేదా చిక్కింది అని అర్ధం (మనం ఏదైనా సాధించినప్పుడు సంతోషం తో  "యాహూ" అనో, హుర్రే అనో, గాటిట్ అనో, సక్సెస్ అనో అరుస్తాము కదా! అలాగే). రూపుధరించిన ఆ రూపరహిత నిరాకార పరబ్రహ్మను చూసిన అత్రి మహాముని అచ్చంగా అన్నివిధాలా (రూప మరియు గుణ లక్షణాలలో) అటువంటి పుత్రుడినే కోరికగా కోరతాడు. ఆవిధంగా పరబ్రహ్మ అత్రి మహామునికి దిరికిపోయాడు.

ఆ కోరికకు సంతోషించిన పరబ్రహ్మ అత్రి మహాముని తో "అచ్చంగా అన్నివిధాల నన్ను పోలిన పుత్రుడు నేనే తప్ప మరెవరూ లేరని చెప్పి తనకు తానుగా
ప్రత్యేకతలను ఆపాదించుకున్న అవతారమూర్తిగా, మీ తనయునిగా పుడతానని" వరమిస్తారు. ఆ వరప్రసాదమే దత్తాత్రేయుడు. ఆ విధంగా పరబ్రహ్మ అత్రి మహాముని యొక్క వేదజ్ఞానాన్ని పరీక్షింపదలచి వచ్చి తనకు తానే చిక్కుకుపోయాడు (దత్తం). ఈ యదార్ధ ఘటన 200 కోట్ల సంవత్సరాల క్రితం (200,00,00,000 సంవత్సరాల క్రితం) జరిగింది.

దత్తాత్రేయ అవతార ప్రత్యేకత
దత్తాత్రేయుడు పరబ్రహ్మ యొక్క పరిపుర్ణావతారము. ఇంకా చెప్పాలంటే రూపంలేని ఆకారంలేని పరబ్రహ్మ రూపంధరించి ఒక ఆకారంలో కనిపిస్తే అదే దత్తాత్రేయుడు. ఈ అవతారం దేవతలను, మానవులను మరియు క్రిందిస్థాయి వారిని ఉద్ధరించడానికి పరబ్రహ్మ తనకితానుగా ఏర్పరుచుకున్న పరిపుర్ణావతారము. అందువల్లే పరబ్రహ్మకు ఉన్న అన్నిలక్షణాలు దత్తాత్రేయునికి ఉంటాయి. అన్ని యుగములలోని అన్ని భగవంతుని అవతారాలని గమనిస్తే దైవత్వం మరియు దైవ లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. కాని దత్త పరబ్రహ్మ అవతారములో మాత్రమే  దైవత్వం, దైవ లక్షణాలు మరియు గురుత్వం , గురు లక్షణాలు కనిపిస్తాయి. అందువల్లే దత్తావతారం అత్యంత ప్రత్యేకమైనది. 
పరబ్రహ్మ
 దత్తాత్రేయుడు
ఊహకు అందనిది, రూపం లేనిది.
 ఊహకు అందని వాడు, రూపం లేకపోయినా వివిధ రూపాలను ధరించువాడు
  మానవ పంచేంద్రియముల చేత గ్రహించబడనిది పరబ్రహ్మ
 మానవుల కోసమే ఏర్పడిన, 'పరబ్రహ్మ ప్రత్యేకతలను' కలిగిన అవతారము
 జగత్తు యొక్క సృష్టి-స్థితి-ప్రళయము లను చేయు ఏకైక నిరాకారమే బ్రహ్మము
 యోగవిద్యను, గురు పరంపరను నిలుపుటకు విచ్చేసిన సాకారమే దత్తాత్రేయుడు
దత్తాత్రేయుడు తమ అవతారమును గూర్చి  "విద్యుత్ శక్తి - విద్యుత్ తీగ" లతో పోల్చి 'శ్రీ దత్తగురు భగవద్గీత' లో క్రింది విధంగా చెప్పారు.

"మానవులు విద్యుత్తును చూడగలరా?.... చూడలేరు.
 అలాగే  విద్యుత్తును తాకగలరా?...తాకలేరు.
అదే మానవులు విద్యుత్ తీగను చూడగలరా?.... చూడగలరు.
విద్యుత్ లేకుండా ఉట్టి తీగను తాకగలరా?... తాకగలరు.
ఇప్పుడు  విద్యుత్ ప్రవహిస్తున్న విద్యుత్ తీగను తాకగలరా?...తాకలేరు.

కాబట్టి విద్యుత్ ప్రవహిస్తున్న విద్యుత్ తీగలో విద్యుత్ గుణమే ఉన్నది తప్ప తీగ గుణము లేదు. అలాగే మీకు తీగలాగ కనబడుతున్న నాలో ప్రవహించేది విద్యుత్ వంటి పరబ్రహ్మమే ! మీరు కేవలం తీగను మాత్రమే చూడగలరు. అంటే ఇక్కడ బ్రహ్మమే విద్యుత్, తీగయే అవతారశరీరము"  అని వివరించి చెప్పిరి.
దత్తబ్రహ్మము యొక్క అవతారము అతి రహస్యముగా, అతి సామాన్యముగా  ఉంటుంది. ఎంత రహస్యమూ, సామాన్యమూ అంటే మానవులకే కాదు దేవతలు, ఋషులకు సైతం ప్రకటితం కాకుండా ఉంటుంది. కనపడని వియోగమే విలువైనదని, వియోగంలోనే భక్తి పరాకాష్టకి చేరుతుందని దత్తాత్రేయుల వారు తరచుగా చెబుతుంటారు. ఈ విధమైన పరిస్థితులలోనే భక్తుల యొక్క నిజమైన భక్తి, ప్రేమలను దత్తబ్రహ్మము గమనిస్తారు.
 దత్తాత్రేయుని చతుర్విధ అవతారములు
  •  కళావతారము: ఏదైనా జీవిలో దత్తాత్రేయుని 'కళ' ప్రవేశించినచో దానిని కళావతారము అంటారు. ఉదా:మాణిక్ ప్రభుజీ అవతారం
  •  అంశావతారము: ఏదైనా జీవిలో దత్తాత్రేయుని తత్వబిందువు ప్రవేశించినచో దానిని అంశావతారము అంటారు. ఉదా:షిర్డీ సాయి అవతారము
  •  పుర్ణావతారము: అష్టసిద్ధులు, నాలుగుకళలు లేకుండా ద్వాదశకళలతో ఏర్పడిందే పుర్ణావతారము ఉదా: రామావతారం
  •  పరిపుర్ణావతారము: షోడశకళలతో ఏర్పడిందే పరిపుర్ణావతారము. ఉదా: ద్వాపరయుగంలోని శ్రీ కృష్ణావతారము మరియు కలియుగంలోని శ్రీపాద శ్రీ వల్లభ,             నృసింహసరస్వతి, స్వామిసమర్ధ అవతారాలు.

దత్తాత్రేయుడు - శ్రీ కృష్ణుడు

ద్వాపరయుగంలో దత్తాత్రేయుని షోడశకళలతో ఏర్పడిన  పరిపుర్ణావతారమే శ్రీకృష్ణ అవతారము. అందువల్లనే దత్తాత్రేయునికి  శ్రీకృష్ణునికి మధ్య ఎన్నో పోలికలు ఉంటాయి. శ్రీకృష్ణుని నిర్యాణము అనతరం కలి ప్రవేశించినది. శ్రీకృష్ణ నిర్యాణము క్రీ.పూ. 3102 సంవత్సరం ప్రమాదినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారం, అశ్వనీ నక్షత్రంలో జరిగింది. ఇప్పటి నూతన కేలండర్ ప్రకారం BC 3102 ఫిబ్రవరి 18వ తేది న అర్ధరాత్రి 2 గంటల 27 నిమిషాల 30 సెకెండ్లకు .శ్రీ కృష్ణ నిర్యాణము జరిగింది (18/02/3102 BC - 02:27:30). శ్రీ దత్తాత్రేయుడు,శ్రీ కృష్ణుడు మాత్రమే 'గో' సమేతులు.ఇరువురూ త్రైలోక్య గురువులే, ఇరువురూ త్రిముర్త్యాత్మకులే.దత్త పరబ్రహ్మవలె శ్రీకృష్ణుడు కుడా 'గో' ప్రియుడు, శ్రీకృష్ణునివలె దత్త పరబ్రహ్మ కుడా 'ప్రేమ' తత్వాన్ని ఆస్వాదించే శాంతి సముద్రుడు. ఇరువురికీ మార్గశీర్షమాసమంటే ఇష్టం. శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ కృష్ణుడు ఇరువురూ రాశిచక్రంలో దాదాపుగా ఒకే స్థానములో, ఒకే రాశి అయిన 'వృషభరాశి' లో  ఆవిర్భవించారు. అందువల్లే దత్తాత్రేయ అనుష్టుప్ మంత్రములో " దత్తాత్రేయ హరే కృష్ణా......" అని చెప్పబడినది. అదే విధంగా దత్తాత్రేయుని షోడశ దత్తావతారములలో  చివరదైన "శ్యామ కమలలోచనుడు" అన్నివిధాలా శ్రీ కృష్ణుని పోలి ఉంటాడు.దత్తాత్రేయుడు ఎన్నో సందర్భాలలో శ్రీకృష్ణుని యొక్క సఖియైన 'రాధ' యొక్క భక్తిని, ప్రేమను గుర్తు చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ద్వాపరయుగంలో రాధ యొక్క భక్తి, ప్రేమ పారవస్యాలు మిగతా అన్ని యుగాలలో దత్తాత్రేయుడు గుర్తుచేస్తుంటారు. దత్తాత్రేయుడు అవతారమును చాలించుకోనతలచినప్పుడు రాధ యొక్క స్థితిని స్మరిస్తారట! ఆవెంటనే దత్తాత్రేయుని ప్రాణములు పోతాయట! రాధస్మరణ ఆయనను తాకగానే శాంత సముద్రుడైన ఆయన అల్లకల్లోలంగా అయిపోతారట! ప్రళయకాలములో సర్వజీవుల మరణ వేదనలను ఆయన అవలీలగా తట్టుకొనగలరట! కానీ 'రాధాహృదయ భక్తి వేదనను' తట్టుకొనే శక్తిలేక ఆయన ప్రతీ అవతారశరీరమూ రాలిపోతుందట! ఎంతటి ఆశ్చర్యము! దత్తాత్రేయుడేనా ఈ మాటలు పలికింది అనిపిస్తుంది. మరీ విడ్డూరంగా 'రాధా భక్తి రసాన్ని' విదేశీ మద్యంతో పోల్చి చెబుతారు శ్రీ దత్తస్వామీ. రాధ యొక్క భక్తి గురించి వారు చెప్పినది ఉన్నది ఉన్నట్టుగా మీకోసం... చదవండి...

శ్రీకృష్ణ శ్యామకమలలోచనుడు (దత్తాత్రేయుని షోడశావతారం)

దత్తపరబ్రహ్మ - రూపం
II సహస్రశీర్షా పురుషః  సహస్రాక్షః  సహస్రపాత్
సభూమిం విశ్వతో వృత్వా అత్యంతిష్ట దశాంగుళం II
ఋగ్వేదం లోని పురుష సూక్తం ప్రకారం పరబ్రహ్మ దశాంగుళంగా సృష్టినేర్పరచి దానిని అధిష్టించి ఉన్నాడని తెలుపుతోంది. దశాంగుళము అనగా పది కొలమానములు గలది అని అర్ధము. ఇక్కడ త్రిగుణాత్మక సృష్టి మరియు ఏడు లోకములు కలసి దశాంగుళముగా ఏర్పడ్డాయి. అవి: 
1. హిరణ్యగర్భ భాగము - సృష్టి (బ్రహ్మ అని అంటారు), 2. నారాయణ భాగము - స్థితి (విష్ణు అని అంటారు), 3. రుద్రభాగము - లయ (మహేశ్వరుడు అని అంటారు) అలాగే 1. భూలోకము. 2. భువర్లోకము. 3. సువర్లోకము. 4. మహాలోకము. 5. జనలోకము. 6. తపోలోకము. 7. సత్యలోకము. క్రింది దశాంగుళ దత్తాత్రేయ సంకేత చిత్రములో చివరగల మూడు బిందువులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాగా వాటి నడుమన గల వృత్తాకారం లోని ఆరు బిందువులు, మధ్యలో గల ఒక బిందువు కలిపి మొత్తం ఏడు బిందువులు ఏడు లోకములకు చిహ్నాలు. ఇదే ఒకప్పటి ప్రాచీన దత్తాత్రేయుని చిత్రము. కేవలం చుక్కలతో ఉండే ఈ సంకేత చిత్రం చాల శక్తివంతమైనదిగా నిరూపించబడినది. ఈ దత్తాత్రేయ సంకేత చిత్రాన్ని మనసుతో చూస్తూ ధ్యానించడం ప్రాచీన ఆచారము.
ప్రాచీన దశాంగుళ దత్తాత్రేయ సంకేత చిత్రము
దత్తాత్రేయుడు ఏక ముఖుడు మరియు ద్విభుజుడు. దత్తాత్రేయుని వర్ణించిన వివిధ శ్లోకాలు, మంత్రాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అద్వైత మాలామంత్రంలో, దత్తాత్రేయ వజ్ర కవచంలో కుడా దత్తాత్రేయుడు ద్విభుజుడని చెపుతున్నాయి. శ్రీ బ్రహ్మాండపురాణం లోని ప్రధమ అధ్యాయంలో దత్తాత్రేయుని మహిమను వర్ణిస్తున్న క్రింది శ్లోకం చదవండి. ఇక్కడ కూడా దత్తాత్రేయుడు ద్విభుజుడు గా పేర్కొనబడ్డాడు. దీనిని బట్టి గమనిస్తే కేవలం అందరికీ  సులభం గా  అర్ధమవ్వడం కోసం, ఇవ్వబడిన ఆదేశాలకు లోబడి శిల్పులు, చిత్రకారులు, చరిత్రకారులు, గ్రంధకర్తల (పై వారి ఆదేశాల మేరకు) సృష్టే త్రిముఖ షట్భుజ దత్తాత్రేయుడని తెలుస్తోంది. ఇక్కడ మనం గమనించవలసిన మరొక  విషయమేమిటంటే భుజముల సంఖ్య. శాండిల్యోపనిషత్తు లో "చతుర్భాహు ముదారాంగం" అని చెప్పరే గాని, ముఖముల సంఖ్య చెప్పలేదు. అలాగే దత్తాత్రేయుని షోడశ అవతారాలలో రెండవదైన "శ్రీ అత్రి వరదుడు" కి ఆరు భుజములు (ఆరు వరదహస్తాలు) ఉన్నట్లుగా చెప్పబడినది కాని ఇక్కడ కుడా ముఖముల సంఖ్య చెప్పలేదు. దత్తాత్రేయుని జన్మ స్థలమైన నేపాల్ లోని భట్టగావ్ అనే ప్రాంతంలో గల దత్త దేవాలయం లోని దత్త విగ్రహం కూడా 'ఏక ముఖ ' దత్తాత్రేయుడే. ఈ దత్తాత్రేయుడినే 'ఆది దత్తాత్రేయుడు' అని అంటారు. ఇక బాహువుల (భుజముల) సంఖ్య అనేది కేవలం దైవత్వాన్ని ఆపాదించడానికి పెట్టినవే తప్ప మరొకటి కాదు.
దత్తాత్రేయుని బాహువుల (భుజముల/ చేతుల) సంఖ్యను తెలిపే వివిధ శ్లోకాలు
త్రివర్ణం త్రియుగం త్ర్యంశం త్రిగుణేశం త్రయీమయం
ఆదిమధ్యాంతరహితం అనంతేతి చ విశ్రుతం
బ్రహ్మోపేంద్రేశరూపం చ క్వచిదేకం పృథక్క్వచ
రక్తచందనలిప్తాంగం హంసవాహనమచ్యుతం
స్వరాలింగితవామాంగం ద్విభుజం ద్విజదైవతం
కమండలుం చ బిభ్రాణం పూర్ణం దివ్వాంబునా సదా
 (శ్రీ బ్రహ్మాండపురాణే దత్తాత్రేయ మహాత్మ్యే ప్రథమాంశే విశ్వరూపదర్శనం నామ ప్రథమోధ్యాయః )
 
II యోగారూఢమ్ యోగపట్టేన వీతం హస్తద్వంద్వం జానుయుగ్మేప్రసార్య II
 
IIసాధకః ప్రాతరుథ్థయ కృతశౌచక్రియ స్మరేత్, ఆత్రేయం బ్రహ్మ రంద్రస్థం ద్విభుజం గురురూపిణం II
  || దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ 
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||
|| భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ 
చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||
(శాండిల్యోపనిషత్తు)
నవీన దత్తాత్రేయ సంకేత చిత్రములు (ద్వాపర మరియు కలియుగం)
ముఖములు
 భుజములు
 గోవు (ఆవు) యొక్క స్థానం
ఏకముఖ
 ద్విభుజ
  గోవు దత్తత్రేయునికి కుడివైపు లేదా ఎడమవైపు ఉండవచ్చు (సాధారణంగా ఏకముఖ ద్విభుజ దత్తత్రేయునికి ఆవు కుడివైపు ఉంటుంది)
 ఏకముఖ
 చతుర్భుజ
 గోవు దత్తత్రేయునికి ఎడమవైపున మాత్రమే ఉండవలెను
  ఏకముఖ
షట్భుజ
  గోవు దత్తత్రేయునికి ఎడమవైపున మాత్రమే ఉండవలెను
 త్రిముఖ
చతుర్భుజ 
  గోవు దత్తత్రేయునికి ఎడమవైపున మాత్రమే ఉండవలెను
   త్రిముఖ
 షట్భుజ
  గోవు దత్తత్రేయునికి ఎడమవైపున మాత్రమే ఉండవలెను
 పంచముఖ
 అష్టభుజ
  గోవు దత్తత్రేయునికి అష్టదిక్కులలో ఎక్కడైనా ఉండవచ్చు
ఏకముఖ ద్విభుజ దత్తపరబ్రహ్మ

కూర్చునిఉన్న  ఏకముఖ ద్విభుజ  దత్తాత్రేయుడు

ఏకముఖ చతుర్భుజ దత్తపరబ్రహ్మ

ఏకముఖ షట్భుజ దత్తపరబ్రహ్మ

ఉత్తరరామేశ్వరం లో గల ఏకముఖ షట్భుజ సిద్ధాసన దత్తాత్రేయుడు

త్రిముఖ చతుర్భుజ దత్తపరబ్రహ్మ
త్రిముఖ షట్భుజ దత్తపరబ్రహ్మ

పంచముఖ అష్టభుజ దత్తపరబ్రహ్మ

ప్రముఖ ఏకముఖ దత్త దేవాలయాలు
నేపాల్ లోని భట్టగావ్ (భక్తాపూర్) - ఏకముఖ దత్త దేవాలయం ( ఆది దత్తాత్రేయ దేవాలయం)
 ఎత్తిపోతల ఏకముఖ దత్త దేవాలయం (ఆంద్రప్రదేశ్ లోని మాచర్ల-నాగార్జున సాగర్ దగ్గర)
 వెంగుర్ల లో(కుబాల్ వాడ లోని) 900 సంవత్సరాల పురాతన ఏకముఖ దత్త దేవాలయం  (మహారాష్ట్ర లోని సిందుర్గ్ జిల్లా) 
 శ్రీక్షేత్ర నారాయణపూర్ ఏకముఖ దత్త దేవాలయం (మహారాష్ట్ర లోని పూణే - సతార దగ్గర)
 బ్రహ్మగిరి దగ్గర నీల్ పర్వతం పై గల ఏకముఖ దత్త దేవాలయం ( మహారాష్ట్ర లోని నాశిక్ జిల్లా లో ని త్రయంబక్ వద్ద)
 కొల్హాపూర్ లో విట్టల దేవాలయ ప్రాంగణంలో గల ఏకముఖ దత్త దేవాలయం (మహారాష్ట్ర లో)
 సకోరి ఆశ్రమం లోని ఏకముఖ దత్త దేవాలయం (మహారాష్ట్ర లోని షిర్డీ నుండి 5 కీ.మీ. దూరం)
  ఉత్తరరామేశ్వరం గ్రామంలో గల ఏకముఖ సిద్ధాసన దత్తాత్రేయుడు (హైదరాబాద్ బెంగలూరు హైవే, షాద్నగర్  దగ్గర, ఆంధ్రప్రదేశ్)
రూపరహితుడైన దత్త పరబ్రహ్మ యొక్క రూపం గురించి వేదాలే చెప్పలేక పోయాయి. కాని దత్త పరబ్రహ్మ తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఉద్దరించడానికి రూపసహితులుగా మారుతుంటారు. ఈ విధమైన సర్వవిధముల రూపాలు సర్వవిధముల అహంకారములు పోగొట్టు "జ్ఞానబోధకగురురూపాలు". భూలోకంలో మాత్రమే ప్రతేకంగా దత్త పరబ్రహ్మ మానవులకు గల అనేక రకాలైన అహంకారములను అణుచుటకు అనేక రకాలైన రూపాలలో కనిపిస్తుంటారు. దత్త పరబ్రహ్మ వివిధ లోకాలలో ఏ ఏ రూపాలలో కనిపిస్తుంటారో తెలిపే క్రింది పట్టిక చూడండి.
లోకము
 అహంకార రకము
 రూపము
దేవలోకం
 -
  త్రిశురుడిగా
 పాతాళలోకం
 -
 కపిలుడిగా
 భూలోకం
 రూపాహంకారం గల వారికి
 కురూపిగా
 భూలోకం
 వయోహంకారం గలవారికి
 వృద్దునిగా
 భూలోకం
 కళాహంకారం గలవారికి / ఉద్యోగాహంకారం గలవారి
 కళాహీనుడిగా / ఉద్యోగహీనుడిగా
 భూలోకం
 బ్రహ్మచర్యాహంకారం గలవారికి
 గ్రుహస్థునిగా
 భూలోకం
 గృహస్థాహంకారం గలవారికి
 వ్యభిచారిగా
 భూలోకం
 విద్యాహంకారం గలవారికి
 పామరునిగా
 భూలోకం
 కులాహంకారం గలవారికి
 కులబ్రష్టునిగా
 భూలోకం
 పురుషాహంకారం గలవారికి
  స్త్రీగా
 భూలోకం
 ఆచారాహంకారం గలవారికి
 మద్యపానం చేయుచున్న చండాలునిగా
 భూలోకం
 మతాహంకారం గలవారికి
 అన్యమతస్థునిగా
దత్త పరబ్రహ్మ యొక్క స్థానములు
దత్తాత్రేయుడు తరచుగా కనిపించు స్థానములు
ఔదుంబర వృక్షమందు (మేడి చెట్టునందు)
 పనస వృక్షమందు
 అస్వద్ధ వృక్షమందు (రావి చెట్టునందు)
  మందారచెట్టు నందు (దత్తాత్రేయుని సభ కొలువుతీరేది మందారచెట్టు క్రిందే)
 బ్రహ్మకమలము లందు
 గోవు నందు
 శరమము (కుక్క) నందు
 ఉన్మత్తునిగా ప్రముఖ శైవ, వైష్ణవ క్షేత్రములందు
 నదీసంగమ ప్రదేశాలనందు
 సాలగ్రామములందు
 విబూధి, చందనములనందు
తిరుమల తిరుపతి పద్మావతీ వెంకటేశ్వరస్వామి - దత్తాత్రేయుడు - శ్రీ పాద శ్రీ వల్లభుడు
తాళ్ళపాక అన్నమాచార్యులు క్రీ.శ.1408 క్రీ.శ.1503 మధ్య వారని తెలుస్తోంది. అన్నమయ్య తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. ఈయన దాదాపు గా 32,000 సంకీర్తనలు రచించాడని తెలుస్తోంది. అన్నమాచార్యుల వారి అన్ని కీర్తనలూ శ్రీ పద్మావతీ వేంకటేశ్వరస్వామి వారి మీదనే ఉంటాయని మనకు తెలుసు. తనదైన శైలిలో కేవలం వేంకటేశ్వరుడిని మాత్రమే వివిధ రకాలుగా కీర్తించే వారు అన్నమాచార్యుల వారు. వారు ఎప్పుడూ  ఏ కీర్తన లోనూ వేంకటేశ్వరుడిని వేరే దేవతావతారములతో పోల్చేవారు కాదు. అటువంటి అన్నమాచార్యులు ఆశ్చర్యంగా ఒక కీర్తనలో ఆయన ఆరాధించే వేంకటేశ్వరస్వామిని అన్ని లోకాలకు, అందరికి  'గురుడు' (గురువు) అని,  కర్మయోగి, సానబట్టిన భోగి, జ్ఞాన యోగి, బ్రహ్మయోగి , అభ్యాసయోగి అనే 'యోగి' పదములతో కీర్తిస్తూ 'గురు' పదములను ప్రయోగిస్తూ   వేంకటేశ్వరుడే కపిలుడు మరియు దత్తాత్రేయుడు అని చెబుతారు. ఈ కీర్తనని బాగా గమనిస్తే వేంకటేశ్వరస్వామి దత్తాత్రేయుల రూపంలో దర్శనమిచ్చి ఈ కీర్తన వ్రాయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే క్రీ.శ.1350 లో శ్రీమాన్ శంకర భట్టు గారు వ్రాసిన 'శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం' లో 28వ అధ్యాయంలో శ్రీపాద శ్రీ వల్లభస్వామే (దత్తాత్రేయుడు) శ్రీ పద్మావతీ వేంకటేశ్వరుడు అని చెప్పడం జరిగింది. కాని మనకి ఈ విషయం శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత గ్రంధం 2001 సంవత్సరం లో స్వర్గీయ శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి ద్వారా వెలుగులోకి వచ్చిన అనంతరం మాత్రమే తెలిసింది. కాని ఇదే విషయాన్ని అన్నమయ్య జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు దాదాపు క్రీ.శ.1501- క్రీ.శ.1502 మధ్య  "మరులుంకు" అనే అగ్రహారంలో ఉండి ఈ కీర్తన ద్వారా తెలియజేశారు.  ఎంతో ఆర్ద్రతతో నిండి ఉన్న ఈ అరుదైన సంకీర్తన మీకోసం....

తానే  తానే ఇందరి గురుడు  | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||

అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ |  ప్రపన్నులకు బుద్ధి పచరించి|
తపముగా ఫల పరి త్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి ||
తానే  తానే ఇందరి గురుడు  | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||

అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి |
ఉన్నతపదమున కొనరంగ కరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||
తానే  తానే ఇందరి గురుడు  | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||

తనరగ కపిలుడై దత్తాత్రేయుడై |  ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై |
వనరగ సంసార యోగము కృపసేయు | అనిమిష గతులను అభ్యాసయోగి ||
తానే  తానే ఇందరి గురుడు  | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||




Click Here To View Sources & Evidences